ANDRAPRADESH,రాజమండ్రి,కాకినాడ జిల్లా: ఏపీలో మరో నగరానికి రింగ్ రోడ్డు రాబోతోంది. రాజమహేంద్రవరంలో త్వరలో రింగ్ రోడ్డు రానుందని మంత్రి నారాయణ తెలిపారు. అంతేకాదు పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు కూడా మొదలుపెట్టారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు మరో రూ.7 వేలు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పుల భారం మోపిందని, పెట్టుబడుల కోసం మంత్రులు విదేశాలకు వెళ్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన చెప్పారు.
ఏపీలో మరో నగరానికి రింగ్ రోడ్డు నిర్మించనున్నారు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దాని చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ త్వరలో రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మధురపూడి, రాజానగరం, దివాన్చెరువు, సంపత్నగర్, కడియం మీదుగా ఈ రింగ్రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణతో పాటు రాజమహేంద్రవరం నగర, గ్రామీణ, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జేసీ మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు.
రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు, కాలువల విస్తరణ పనులు కూడా చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు. బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 80 అడుగుల వెడల్పు రోడ్డును రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి. పుష్కర ఘాట్లను కూడా విస్తరిస్తామని.. రాజమహేంద్రవరంలో రూ.100 కోట్లతో ముంపు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల విడుదలలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారాయణ అన్నారు. ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం రూ. 2000, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు రెండో విడతగా మరో రూ. 7 వేలు విడుదల చేస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఈ మొత్తంతో కలిపి రైతులకు ఎన్నికల ముందు చెప్పిన రూ. 20 వేల హామీ నెరవేరుతుందని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు మంత్రి నారాయణ. రూ. 10 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని.. ఈ అప్పులను ప్రజలే పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని, పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రులు విదేశాలకు వెళ్తున్నామన్నారు. ఒక్కో మంత్రికి రెండు దేశాల చొప్పున పెట్టుబడుల ఆహ్వానం కోసం వెళ్తున్నామన్నారు. తాను దుబాయ్, సౌత్ కొరియాలో పర్యటించి అనేక వ్యాపారవేత్తలను కలిసి రాష్ట్రానికి ఆహ్వానించామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు (ఎంఓయులు) కుదిరాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ఎన్నికల హామీల్లో 90 శాతం నెరవేర్చామని, మిగిలిన 10 శాతాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు.

Social Plugin